తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనందించే లక్ష్యంతో చేతన ఫౌండేషన్ మరియు గూడూరు ట్రస్ట్ ఆర్థిక సహకారంతో, కొల్లి ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు గురువారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత కుమారి మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (ఎడ్యుకేషన్) ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని అన్నారు. సమాజాభివృద్ధిలో సేవా సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ మహిళా సాధికారతకు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ సభ్యులు వెనిగళ్ళ అనిల్ కుమార్, దొడ్డ సీతారామయ్య, చంద్రకాని నవీన్,కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పన, రూప్లా నాయక్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.